Showing posts with label జన్మ వ్రుత్తాంతం. Show all posts
Showing posts with label జన్మ వ్రుత్తాంతం. Show all posts

Sunday, 25 November 2012

తారకాసురుడు

వజ్రాంగుడనే రాక్షసుని కుమారుడు తారకాసురుడు. బ్రహ్మ కోసం తీవ్రమైన తపస్సు చేసిన తారకాసురుడు సృష్టిలో తనకు సమానమైన బలం కలిగిన వీరుడు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మ వరం ఇచ్చిన తర్వాత ఆ రాక్షసుడు విజ్రుంభించి అన్ని లోకాల వారినీ బాధించడం మొదలుపెట్టాడు. చివరికి శివుని కుమారుడే తారకాసురుడిని వధించగలడని బ్రహ్మ చెబుతాడు. శివపార్వతులకు జన్మించిన కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేసి, ఆ యుద్ధంలో అతడిని సంహరిస్తాడు. 

జనమేజయుడు

వైశంపాయనుడు, భారత కథను జనమేజయునికి వినిపించాడు. అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. తన తండ్రి పాముకాటు వల్ల మరణించాడన్న సంగతి తెలుసుకున్న జనమేజయుడు సర్పజాతిని నిర్మూలించాలనే ధ్యేయంతో సర్పయాగం ప్రారంభిస్తాడు. సర్పయాగం చేస్తున్న సమయంలో పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి కాలిపోతుంటాయి. అలా సర్పజాతిని నిర్మూలించాలనుకుంటాడు జనమేజయుడు. అయితే సృష్టిలో సర్పజాతి అంతం కారాదనే ఉద్దేశంతో కొందరు జరత్కారువు అనే ముని వద్దకు వెళ్ళి, ఈ యాగం ఆగిపోయే ఉపాయం ఆలోచించమని కోరతారు. జరత్కారువు తన కుమారుడు ఆస్తీకుని జనమేజయుని వద్దకు పంపగా, అతడు జనమేజయుని వద్దకు వచ్చి, తన విద్యా నైపుణ్యం చూపించి, సర్పయాగం మంచిది కాదని నచ్చజెప్పి, ఆ యాగాన్ని ఆపు చేయిస్తాడు. 

పరీక్షిత్తు వృత్తాంతం

పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్ధామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించినప్పుడు, ఆ అస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తును బాధించింది.
గర్భస్థ శిశువు వల్ల కలిగిన బాధకు తాళలేక ఉత్తర శ్రీ కృష్ణుని ప్రార్థించినప్పుడు, అతడు పరీక్షిత్తును కాపాడాడు. గర్భంలో తనకు కనిపించిన దైవము ( శ్రీకృష్ణుడు) లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఇతనికి పరీక్షిత్తు అని పేరు వచ్చింది.
ఉత్తరుని కుమార్తె ఐరావతిని పరీక్షిత్తు వివాహమాడాడు. ఒకసారి ఇతడు వేటకు వెళ్ళి, ఒక మృగాన్ని వేటాడుతూ ఒక ముని ఆశ్రమానికి చేరతాడు. అక్కడ తపస్సమాధిలో ఉన్న మునిని చూసి, తను వెన్నాడి వచ్చిన మృగమేదని అడుగుతాడు.
తపస్సులో ఉన్న ఆ ముని సమాధానం ఇవ్వకపోవడంతో కోపించిన పరీక్షిత్తు, అక్కడ చచ్చి పడి ఉన్న పాము కళేబరాన్ని ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి ముని కుమారుడు వచ్చి, తన తండ్రి మెడలో పాము కళేబరం ఉండటం చూసి, ఈ పని చేసిన వాడు ఏడు రోజులలో పామువల్ల మరణిస్తాడు. అని శపిస్తాడు.
చివరకు తపస్సులో ఉన్న ముని జరిగింది తెలుసుకుని, పరీక్షిత్తు వద్దకు వెళ్ళి, తన కుమారుడిచ్చిన శాపం గురించి చెబుతాడు. పాము వల్ల తనకు మరణం సంభవిస్తుందని తెలుసుకున్న పరీక్షిత్తు, ఒక దుర్భేద్యమైన గృహంలో ఉండిపోతాడు.
ఏడవరోజు పాములు మానవరూపంలో వచ్చి, పరీక్షిత్తుకు పండ్లు ఇస్తారు. అందులోని ఒక పండులో ఉన్న తక్షకుడు అనే పాము బయటకు వచ్చి పరీక్షిత్తును కాటు వేయడంతో అతను మరణిస్తాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు.

ఉపపాండవులు(పాండవుల సంతానం )

పాండవుల కుమారులను ఉపపాండవులని పిలుస్తారు. ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు, వరుసగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులకు జన్మించారు. పూర్వజన్మలో వీరు విశ్వులనే దేవతలు. ఉపపాండవులుగా వీరు జన్మించడం వెనుక హరిశ్చంద్రుని భార్య అయిన చంద్రమతిని నగరము విడిచి వెళ్ళమని విశ్వామిత్రుడు అనడం చూసి, ఋషులకు ఇంత కోపము పనికిరాదని విశ్వువులు అనుకుంటారు. ఇది విన్న విశ్వామిత్రుడికి కోపము వచ్చి, నరులుగా జన్మించమని శపిస్తాడు. ఆ శాపం వల్ల వారు ఉపపాండవులుగా జన్మిస్తారు. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్థామ వీరిని రాత్రిపూట రహస్యంగా సంహరిస్తాడు.

వాలిసుగ్రీవుల జననం

రామాయణంలో కనిపించే వాలిసుగ్రీవుల తండ్రి ఋక్షవిరజుడు. బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆయన కళ్ళ నుండి రాలిన అశ్రువుల నుంచి జన్మించిన వాడు ఋక్షవిరజుడు. అరణ్యంలో తిరుగుతుండగా కనిపించిన ఒక చెరువులో దిగిన ఋక్షవిరజుడు, ఆ చెరువు నుంచి బయటకు వచ్చేసరికి స్త్రీగా మారిపోతాడు. గతంలో పార్వతి ఆ చెరువులో స్నానం చేయడం వల్ల అలా జరిగిందని బ్రహ్మ అతనికి చెబుతాడు. స్త్రీగా మారిన ఋక్షవిరజుడికి ఇంద్రుని వల్ల వాలిసుగ్రీవులు జన్మిస్తారు. ఆ తర్వాత వానరజాతి విస్తరిస్తుంది. 

Saturday, 18 August 2012